Thursday 19 December 2013

పిరికిపందలు!!!


వాళ్ళు చేసే సమైక్యాంధ్ర ఉద్యమం పక్షాన ధర్మం లేదు. వాళ్ళు తెలంగాణను అడ్డుకోవడంలో నీతి, న్యాయం లేదు. వాళ్ళు చెప్పే సమైక్య వాదంలో బలం లేదు. ఉంటే.. గింటే.. అసెంబ్లీలో ఇప్పుడు.. అరవయ్యేళ్ళుగా సాగుతున్న తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తప్పని.. బలంగా వాదించి తూర్పారబట్టవచ్చు గదా!  పద్నాలుగేళ్ళుగా బలపడ్డ వేర్పాటు వాదాన్ని చర్చించి ఎండగట్టవచ్చు గదా! విభజన వల్ల తామేం నష్టపోతామో వివరించి ప్రపంచానికి చాటవచ్చు గదా! కాని వాళ్ళకేం కావాలో వాళ్ళు చర్చించి బయటికి బాహాటంగా చెప్పలేరు. ఎందుకంటే చర్చిస్తే.. వాళ్ళు కోరేదాంట్లో నీతి, నిజాయితీ లేదని తేలిపోతుందని వాళ్ళకూ తెలుసు. వాళ్ళ వాదంలో నిజాయితీ, బలం ఉండి ఉంటే... శాసనసభలో ఈ సువర్ణావకాశాన్ని ఎందుకు వదులుకొంటారు? వాళ్ళ వాదనలో బలం ఉంటే పద్నాలుగేళ్ళుగా తెలంగాణవాదం ఎందుకు బలపడేది? వాళ్ళ వాదనలో బలం ఉంటే ఎందుకు వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేశారు? వాళ్ళ వాదనలో బలం ఉంటే తెలంగాణ పది జిల్లాలలో వాళ్ళ ఉద్యమానికి కనీస మద్దతు ఎందుకు కరువయ్యింది? వాళ్ళ వాదనలో బలం ఉంటే యావత్తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిల్చొని ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది? వాళ్ళ వాదనలో బలం ఉంటే దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనకు ఎందుకు అంగీకరించాయి?  అందుకే చర్చించే దమ్ము, ధైర్యం వాళ్ళకు లేదు. చర్చిస్తే.. అరవయ్యేళ్ళుగా తాము చేస్తున్న దోపిడి బండారం బట్టబయలవుతుందన్న భయం. చర్చిస్తే.. ఆ దోపిడి కొనసాగడానికే తాము తెలంగాణను అడ్డుకొంటున్నామని ఒప్పుకోవలసి వస్తుంది. ఎదుటివాణ్ణి ముంచి తాము బాగుపడాలన్న స్వార్థంతో నిండిందే తమ సమైక్యవాదమని అంగీకరించవలసి వస్తుంది.
పిరికిపందలు... అందుకే చర్చను జరుగకుండా అడ్డుకొంటున్నారు. నానా గొడవ చేసి శాసనసభను రెండు వారాలపాటు వాయిదా వేయించారు.